రౌడీల్లా ప్రవర్తించారు: కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిడ్నీ టెస్టులో హైదరాబాదీ యువపేసర్ మహ్మద్ సిరాజ్కు ఎదురైన అవాంఛనీయ సంఘటనను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా ఖండించాడు. ప్రేక్షకులు రౌడీల్లా ప్రవర్తించారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. నాలుగో రోజు ఆటలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ను ఉద్దేశించి కొందరు ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఆటలోనూ సిరాజ్, బుమ్రాకు ఇలాంటి సంఘటనే ఎదురవ్వడం గమనార్హం.
‘‘జాత్యహంకారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించకూడదు. బౌండరీ లైన్ వద్ద జరిగిన ఎన్నో దయనీయ సంఘటనల్లో ఇది అత్యంత గూండాగిరి ప్రవర్తన. మైదానంలో ఇలాంటి పరిస్థితుల్ని చూడటం చాలా బాధగా ఉంది. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు. 2011-12 ఆస్ట్రేలియా పర్యటనలో తనని ఇబ్బంది పెట్టిన ప్రేక్షకులకు కోహ్లీ వేలు చూపించిన విషయం తెలిసిందే.
సిరాజ్కు ఎదురైన సంఘటనపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించాడు. ‘‘ఆస్ట్రేలియాలో ఇలాంటి సంఘటనలు నాకు ఎన్నో ఎదురయ్యాయి. నా రంగు, మరికొన్ని విషయాలపై మాట్లాడారు. స్టేడియంలో జనాలు ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. అయితే వాటిని ఎలా అడ్డుకోవాలి?’’ అని ట్వీటాడు. కాగా, ఈ సంఘటనను ఐసీసీ ఖండించిన విషయం తెలిసిందే. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) క్షమాపణలు చెప్పింది.
Comments
Post a Comment