ఇంగ్లాండ్ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో ఒక ఆటగాడికి యూకే కరోనా స్ట్రెయిన్ సోకిందని అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో అతడిని ప్రత్యేక క్వారంటైన్కు తరలించామని చెప్పారు. లంక జట్టుతో ఇంగ్లాండ్ నేటి నుంచి రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కన్నా ముందే ఈ సిరీస్ జరగాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. క్రికెట్ మళ్లీ మొదలయ్యాక నేటి నుంచి నిర్వహించడానికి ఇరు జట్లూ అంగీకరించాయి. ఈ క్రమంలోనే జనవరి 4న అక్కడ అడుగుపెట్టిన ఇంగ్లాండ్ ఆటగాళ్లకు కరోనా టెస్టులు చేశారు.
అందులో ఆల్రౌండర్ మోయిన్ అలీకి పాజిటివ్గా తేలిందని, అది యూకే స్ట్రెయిన్గా గుర్తించామని లంక వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అయితే, శ్రీలంకలో ఇదే తొలి యూకే స్ట్రెయిన్ కేసు అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందన్న నేపథ్యంలో గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. అంతకుముందు మిగతా ఆటగాళ్లకి నెగెటివ్ రావడంతో నేటి నుంచి టెస్టు సిరీస్ యథావిధిగా కొనసాగుతందని చెప్పారు. మరోవైపు అలీతో సన్నిహితంగా ఉన్న క్రిస్వోక్స్కు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అయితే, వోక్స్ తొలి టెస్టులో ఆడడం సందేహంగా ఉంది.
Comments
Post a Comment