అది నిజమైతే..జడ్డూ సూపరో సూపర్!
సూపర్ఫామ్లో ఉన్న రవీంద్ర జడేజాను గాయాలు వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో అతడికి తొడకండరాలు పట్టేశాయి. అయినా వేగంగా కోలుకుని రెండో టెస్టులో బరిలోకి దిగాడు. అంతేగాక విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. కానీ, సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మరోసారి గాయపడ్డాడు. శనివారం ఆటలో స్టార్క్ విసిరిన బంతికి అతడి బొటనవేలు విరిగింది. దీంతో ఆస్ట్రేలియాతో జరగనున్న ఆఖరి టెస్టుతో పాటు స్వదేశంలో ఇంగ్లాండ్తో జరగనున్న తొలి రెండు టెస్టులకు దూరమవుతున్నట్లు బీసీసీఐ వర్గాలు ఆదివారం తెలిపాయి.
అయితే సిడ్నీ టెస్టులో టీమిండియాపై ఆస్ట్రేలియా పైచేయి సాధిస్తోంది. భారత్ విజయం సాధించాలంటే రేపటి ఆటలో ఆసీస్ బౌలర్లను 90 ఓవర్లు ఎదుర్కొని 309 పరుగులు చేయాలి. ఇప్పటికే ఓపెనర్లు రోహిత్, గిల్ పెవిలియన్కు చేరారు. పంత్ గాయం నుంచి కోలుకున్నా పూర్తి ఫిట్నెస్ ఉన్నాడో లేదో తెలియన పరిస్థితి. మరోవైపు జడ్డూ మైదానంలోకి రాలేని స్థితిలో ఉన్నాడు. దీంతో ఆసీస్ ఫేవరేట్గా భావిస్తున్నారు. కాగా, భారత జట్టును ఓటమి నుంచి తప్పించాల్సిన పరిస్థితి వస్తే జడేజా విరిగిన వేలుతోనే బరిలోకి దిగుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. పెయిన్ కిల్లర్ను తీసుకుని క్రీజులోకి వస్తాడని వెల్లడించాయి.
‘‘రవీంద్ర జడేజా కోలుకోవడానికి 4-6 వారాల సమయం పడుతుంది. దీంతో ఇంగ్లాండ్తో జరగనున్న తొలి రెండు టెస్టులకు కూడా అతడు దూరమవుతున్నాడు. అయితే సిడ్నీ టెస్టులో జట్టును కాపాడాల్సిన పరిస్థితి తలెత్తితే జడ్డూ బరిలోకి దిగుతాడు. పెయిన్ కిల్లర్ తీసుకుని క్రీజులోకి వస్తాడు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆసీస్ జరిగిన తొలి టీ20లో తొడకండరాలు పట్టేసిన జడ్డూ ఆఖరి వరకు క్రీజులో ఉండి పరుగులు సాధించిన విషయం తెలిసిందే. అయితే టెస్టుల్లో ఆసీస్ పేసర్లు బ్యాట్స్మెన్ మీదకు వచ్చేలా బంతుల్ని ఎక్కువగా విసురుతుంటారు. విరిగిన వేలుతో ఆ బంతుల్ని ఎదుర్కోవడం అత్యంత ప్రమాదకరమే. దేశం కోసం జడేజా స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నా.. జట్టు యాజమాన్యం దాన్ని అంగీకరిస్తుందో లేదో చూడాలి!
Comments
Post a Comment