టీమ్ఇండియా: ఒక శుభవార్త..ఒక చేదు వార్త
టీమ్ఇండియాకు ఒక శుభవార్త.. ఒక చేదువార్త! ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అతడి ఎడమచేతి బొటనవేలు పక్కకు తిరగడంతో, ఎముక విరిగిందని పేర్కొన్నారు. బ్యాటింగ్ గ్లోవ్స్ తొడుక్కోవడమూ కష్టమేనని వెల్లడించారు. కాగా యువ వికెట్కీపర్ రిషభ్ పంత్ మాత్రం మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తాడని తెలిపారు. ఆతిథ్య జట్టు పేసర్లు విసిరిన షార్ట్పిచ్ బంతులకు వీరిద్దరూ గాయపడగా స్కానింగ్ చేయించిన సంగతి తెలిసిందే.
‘రవీంద్ర జడేజా ఎడమ బొటనవేలు పక్కకు వంగడంతో ఎముక విరిగిపోయింది. అతడు గ్లోవ్స్ వేసుకొని బ్యాటింగ్ చేయడం కష్టం. అతడు రెండుమూడు వారాలు క్రికెట్ ఆడలేడు. అంటే నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండడు. పంత్ మాత్రం బ్యాటింగ్ చేయగలడు. అతడి గాయం అంత తీవ్రమైందేమీ కాదు’ అని బీసీసీఐలోని ఓ అధికారి పీటీఐకి తెలిపారు. తొలి ఇన్నింగ్స్లో వేగంగా పరుగులు చేసిన జడ్డూ గ్లోవ్స్ను మిచెల్ స్టార్క్ విసిరి
న బంతి తాకింది. దాంతో అతడిని స్కానింగ్కు పంపించారు.
రిషభ్ పంత్ బ్యాటింగ్ చేస్తుండగా అతడి ఎడమ మోచేతికి కమిన్స్ విసిరిన బౌన్సర్ తగిలింది. దాంతో అతడినీ స్కానింగ్కు పంపించారు. పంత్ 67 బంతుల్లో 36 పరుగులు చేశాడు. వేగంగా ఆడుతున్న క్రమంలో గాయపడటంతో క్రీజులో సరిగ్గా కదల్లేకపోయాడు. ఐసీసీ నిబంధనలు సవరించడంతో రిషభ్ పంత్ బదులు రిజర్వు కీపర్ వృద్ధిమాన్ సాహా ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో కీపింగ్ చేశాడు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా ఆటగాళ్లు ఎక్కువగా గాయపడుతున్నారు. ఇంతకు ముందే మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్ సిరీస్కు దూరమయ్యారు. తుది జట్టులో చోటు దక్కకపోయిన కేఎల్ రాహుల్ సైతం గాయపడడంతో స్వదేశానికి బయల్దేరిన సంగతి తెలిసిందే.
Comments
Post a Comment