ఇది సిగ్గుచేటు: వివాదంపై స్పందించిన స్మిత్
డ్రింక్స్ బ్రేక్లో టీమిండియా బ్యాట్స్మన్ రిషభ్ పంత్ గార్డ్ మార్క్ను ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ చెరిపివేశాడని వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వక్రబుద్ధితో స్మిత్ అలా చేశాడని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై స్మిత్ స్పందించాడు. తనపై ఇలాంటి నిందలు రావడం ఎంతో బాధగా ఉందని అన్నాడు.
‘‘నాపై నిందలు రావడం ఆశ్చర్యంగా, బాధగా ఉంది. మా బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారు, వాటిని ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ఎలా ఎదుర్కొంటున్నారని ఊహిస్తూ... క్రీజులో గార్డు మార్క్ను చేసుకుని ఆలోచించడం నాకు అలవాటు. కానీ టీమిండియా ఆఖరి రోజు చేసిన అద్భుత పోరాటాన్ని మరిచి ఈ విషయాన్ని ఎత్తిచూపించడం మాత్రం సిగ్గుచేటుగా అనిపిస్తోంది’’ అని స్మిత్ అన్నాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ కూడా స్మిత్కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్లో స్మిత్ క్రీజు వద్దకు వెళ్లి అతడే బ్యాటింగ్ చేస్తున్నట్లు గార్డ్ మార్క్ను మార్చుకుంటాడని తెలిపాడు. అతడిది దురుద్దేశమైతే టీమిండియా ఫిర్యాదు చేసేది కదా అని అన్నాడు. కాగా, సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా గొప్పగా పోరాడి మ్యాచ్ను డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్ వేదికగా జనవరి 15న ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది.
Comments
Post a Comment